బాలీవుడ్ (Bollywood) లో టాప్ హీరోయిన్లలో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు. వరుసగా లేడీ ఓరియెంటెడ్, ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్లో దూసుకెళుతోంది. అయితే.. ఈ బ్యూటీ సినిమాలతోనే కాకుండా తన ముక్కుసూటితనంతోనూ వార్తల్లో నిలుస్తుంది. ఏ విషయం మీదైనా ఎటువంటి మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. తాజాగా గతంలో కొందరు మంత్రగత్తె అన్న విషయం గురించి సోషల్ మీడియాలో పంచుకుంది.
200 ఏళ్ల క్రితం మహిళలను మంత్రగత్తెలుగా భావించి సజీవ దహనం చేయడం గురించి సద్గురు మాట్లాడుతున్న వీడియోను కంగనా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దానికి.. ‘మీకు సూపర్ పవర్స్ ఉంటే మిమ్మల్ని మంత్రగత్తె అంటారు.. నన్ను మంత్రగత్తె (Witch) అని పిలిచేవారు, కానీ నేను వారికి కాల్చే అవకాశం ఇవ్వలేదు.. దానికి బదులుగా నేను నిజమైన మంత్రగత్తెని అయ్యాను ఆబ్రా కా దబ్రా’ అని రాసుకొచ్చింది.
మరో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో.. ‘2016లో ప్రముఖ ప్రింట్ ఎడిటర్లలో ఒకరైన సరితా తన్వర్ (Sarita Tanwar) నా గురించి ఓ పరిశోధనాత్మక కథనం రాసింది. అందులో.. నాకు బ్లాక్ మ్యాజిక్ తెలుసని కొన్ని రుజువులను చూపించింది. దీపావళి కోసం నేను అందరికీ బహుమతులను పంపుతాను. దానికోసం పంపే లడ్డుల్లో నా పీరియడ్ బ్లడ్ను కలుపుతానని ఆమె రాసింది’ అని కంగనా రాసుకొచ్చింది.
అలాగే మరో స్టోరీలో.. ‘హా హా ఆ రోజులు సరదాగా గడిచాయి. సినిమా నేపథ్యం, విద్య, మార్గదర్శకత్వం, ఏజెన్సీ, సమూహాలు లేదా స్నేహితులు, బాయ్ఫ్రెండ్లు ఎవరూ లేకుండానే.. బాలీవుడ్లో అగ్రస్థానానికి చేరుకున్నాను. కాబట్టి వారందరూ కలిసి దానికి కారణం నాకు బ్లాక్ మ్యాజిక్ తెలియడమేనని అందరూ చెప్పారు. మ్యాజిక్ !!’ అని వెటకారంగా తెలిపింది. కాగా.. కంగనా ప్రస్తుతం ఎమర్జెన్సీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఎమర్జెన్సీ’ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. అలాగే.. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ‘సీత ఇన్కార్నేషన్’ అనే మూవీ చేస్తోంది.